e-cigarette review Ping Yahoo GOSSIPS

Monday, January 23, 2012

బిర్యానీ భామ ఫుల్ బిజీ అట!

అందం ఉండాలే గాని దానికి అభినయాన్ని జోడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విద్య తెలిస్తే ఈజీగా ఏ భాష లోనైనా హీరోయిన్ అయిపోవచ్చు. బిందు మాధవి కూడా అదే పని చేసింది. ఔను...'ఆవకాయ్ బిర్యాని' అంటూ అందరినీ ఊరించిన బిందు మాధవి గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ సినిమాలో బిందు మాధవిని చూసిన వాళ్లంతా తెలుగు తెరకి ఓ తెలుగు కథానాయిక దొరికిందనుకుని ఆనందించారు. అయితే...ఆ తర్వాత వచ్చిన అవకాశాలేవీ ఆమెకి పెద్దగా ఉపయోగపడలేదు.
     దాంతో నిరాశ పడకుండా నెమ్మదిగా తమిళ తెరను టచ్ చేసింది. అంతే వరస విజయాలు ఆమె వాకిట్లో కొచ్చి వాలాయి. ప్రస్తుతం డేట్స్ ఎడ్జస్ట్ చేయడానికి కూడా బిందు మాధవి ఇబ్బంది పడుతోందట! తమిళ ప్రేక్షకులు ఆశించే అందం...ఆకర్షణ ఉండటం వల్లే అక్కడ ఆమె అంత బిజీ కావడానికి కారణమని అంటున్నారు. ఈ హడావిడి అంతా చూస్తుంటే, ఆమె రచ్చ గెలిచి ఇంటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల రాత ఏ భాషలో ఉంటుందో తెలియదుగాని, అది సక్రమంగా ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?          
*  అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రానికి 'పార్ట్ నర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మొదట్లో 'హనీ' అనే పేరు తెరపైకి రావడం, బన్నీ దానిని ఖండించడం తెలిసిందే.
 *  సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఎస్.ఎం.ఎస్' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. మహేష్ బాబు ఆడియోను విడుదల చేయగా, వి.వి .వినాయక్ తొలి సీడీని స్వీకరించారు. కృష్ణ, విజయనిర్మల కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
*  ఆది పినిశెట్టి కథానాయకుడుగా వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన అనువాద చిత్రం 'ఏకవీర' డీటీయస్ పనులు పూర్తయ్యాయి. 300 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత చెప్పారు.
*  'జల్సా' చిత్రం తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సరదా' అనే టైటిల్ నిర్ణయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  సిద్ధార్థ్, అమలాపాల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'లవ్ ఫెయిల్యూర్' చిత్రం ఆడియోను ఈ నెల 28 న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సిద్ధూ ఓ పాట కూడా పాడాడు. వేలంటైన్స్ డే కి చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.

మహేష్ బాబు పేరు మారిపోయిందట!

మహేష్ బాబు పేరు ఇప్పుడు మారిపోయిందట. అందరూ అసలు పేరు వదిలేసి తననిప్పుడు 'సూర్యాభాయ్' అంటూ పిలుస్తున్నారట. ఈ విషయాన్ని మహేష్ బాబే తాజాగా వెల్లడించాడు. ఇంతకీ సూర్యాభాయ్ అంటే అందరికీ తెలిసిందే.... ఇటీవల విడుదలైన 'బిజినెస్ మేన్' సినిమాలో మహేష్ పోషించిన పాత్ర పేరది. దీని గురించి మహేష్ చెబుతూ, "దర్శకుడు పూరీ జగన్నాథ్ కారణంగా నా పేరు సూర్యాభాయ్ గా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు. అంతలా 'బిజినెస్ మేన్' సినిమాలోని ఆ పేరు పాప్యులర్ అయిపోయింది. ఈ సినిమాని అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు" అంటున్నాడు ఆనందంతో మహేష్... సారీ... సూర్యాభాయ్!

తెరమరుగవుతున్న తెలుగు విలనిజం!

తెలుగు సినిమా వెలుగు చూసిన నాటి నుంచి ఎన్నో వైవిధ్యమైన కథలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ వస్తున్నాయి. పౌరాణిక-జానపద-సాంఘిక-చారిత్రకాలలో కథాంశం ఏదైనా నాయకుడితోపాటు ప్రతి నాయకుడు ఉండటం సహజం. సినిమాల్లో కనిపించే నాయక ప్రతినాయకులు జీవితంలోని చీకటి వెలుగులను ప్రతిబింబిస్తుంటారు. చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ...చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలుస్తుంది. అలాగే పవర్ ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరో ఎంత సత్తా ఉన్నవాడనేది తెలుస్తుంది. అందుకే, తెలుగు సినిమా తొలి నాళ్ల నుంచి కూడా విలన్ పాత్రలకి ఎంతో ప్రత్యేకత- ప్రాధాన్యత ఏర్పడ్డాయి. దాంతో కథానాయకుడితో సమానమైన ఇమేజ్ విలన్ కి కూడా లభిస్తూ వచ్చింది.
      కథానాయకుడు తన ఆట పాటలతో...హీరోయిజంతో  ఆడియన్స్ ని ఆకట్టుకుంటే, విలన్ మాత్రం తన విలక్షణమైన నటనతోనే ఎక్కువ మార్క్ లు సంపాదించుకోవలసి వస్తుంది. విలన్ల మేనరిజమే వాళ్లకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఎస్.వి.రంగారావు...రాజనాల...నా
గభూషణం...ప్రభాకర్ రెడ్డి...త్యాగరాజు...సత్యనారాయణ...రావు గోపాలరావు...నూతన్ ప్రసాద్...కోట శ్రీనివాసరావు... తదితరులు ఇదే విషయాన్ని నిరూపించారు. పాత బంగారం లాంటి ఆనాటి కథలను పరిశీలిస్తే... నాయకుడు-ప్రతినాయకుడు కథని సమతూకంగా నడిపించిన తీరు కనిపిస్తుంది.
     ఆనాటి విలన్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఎస్.వి. రంగారావు విషయానికొస్తే విలనిజం లో ఆయన నభూతో...నభవిష్యతి అనిపించారు. కథానాయకుడు ఎంతటివాడైనా  ఒక చిన్నపాటి మాట విరుపుతో అదిలిస్తూ అధిగమించేవాడు. పౌరాణికాల్లోనే కాదు... జగమెరిగిన జానపద మంత్రగాడిగా జానపదాల్లోనూ ఎస్.వి. రంగారావు ఎదురులేని విలనే! ఆ సమయంలోనే కరుకైన కండలతో, చురుకైన చూపులతో యంగ్ విలన్ గా తన దైన ముద్ర వేశాడు రాజనాల. రాజ్యకాంక్షతో రగిలిపోయే ప్రతినాయకుడిగా ఆయన పండించిన విలనిజాన్ని అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోలేరు.
     ఇక సాంఘికాల విషయానికొస్తే... గ్రామపెద్దగా కుటిల రాజకీయాలను చేసే విలన్ గా నాగభూషణం చూపిన వైవిధ్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పల్సిందే. ఊతపదాల్ని ఉపయోగిస్తూ విలనిజాన్ని రక్తికట్టించిన తొలి విలన్ నాగభూషణమేనని చెప్పొచ్చు. ఆయన సంభాషణల్లోని గమ్మత్తైన విరుపు ... కామెడీ కోటింగ్ తో అందించిన విలనిజం ఆనాటి ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఇక ప్రతినాయకుడిగా రావుగోపాలరావు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఆయన చేసిన పాత్రలు అనితర సాధ్యాలని చెప్పొచ్చు. అలా తరాలవారీగా తరగని విలనిజాన్ని పండించిన ఘనత రావుగోపాలరావుకే దక్కింది.
     విలక్షణమైన విలనిజంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నూతన్ ప్రసాద్. అనుకోని ప్రమాదం ఆయన్ని ఆ స్థానానికి దూరం చేయగా, కోట శ్రీనివాసరావు వెలుగులోకి వచ్చారు. విభిన్నమైన ఆయన మేనరిజానికి ప్రేక్షకులు బ్రహ్మరధంపట్టారు. కోట శ్రీనివాసరావు తర్వాత అడపాదడపా ఫ్యాక్షన్ సినిమాల్లోవిలన్ గా కనిపించిన జయప్రకాష్ రెడ్డిని మినహాయిస్తే, ఇక విలన్ లుగా వీలైనన్ని కొత్తముఖాలే కనిపిస్తాయి. జూ.ఎన్టీఆర్ , మహేష్ బాబు, రాం చరణ్, అల్లు అర్జున్, నితిన్, రామ్ తదితర యంగ్ హీరోల కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలోనూ మన తెలుగు విలన్ల జాడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచే మనకి పరభాషా విలన్ల ప్రభావం పెరగడం, తెలుగు విలన్ లు తెరమరుగు కావడం కనిపిస్తుంది.
     ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్ధి, షాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్ తదితరులు విలన్లుగా ఈ తరం సినిమాలను ప్రభావితం చేస్తున్నారు. ట్రెండ్ తో పాటు విలనిజం మారుతుందని సరిపెట్టుకోలేం. పరభాష విలన్లని దిగుమతి చేసుకోవడం వైవిధ్యంగా భావించలేం. నేటి సినిమాల్లో కథ కన్నా ఖర్చుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండటం వల్ల, కొత్తదనం పేరుతో చేస్తోన్న ప్రయోగాల వల్ల  విలనిజం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆనాటి విలనిజంలో వ్యూహాలు కనిపిస్తే, ఈనాటి విలనిజం ఉన్మాదం అనిపిస్తుంది. ఈనాటి విలన్ ల వింత గెటప్ లు- వికృత చేష్టలు చూస్తుంటే వారి మానసిక స్థితిపై సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలగక మానదు.
     ఆ రోజుల్లో హీరోలు -విలన్లు నువ్వా? నేనా? అన్నట్టు సమఉజ్జీలుగా ఉండే వాళ్లు. ఇక, ఈతరం హీరోలకి గానీ... వాళ్లతో తలపడే విలన్లకి గాని ఎక్కడా పొంతన ఉండదు. లేడిపిల్ల లాంటి హీరో... సింహం లాంటి విలన్ ని చితక బాదేయడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. పోతే, ప్రాంతమేదైనా...భాష ఏదైనా...టాలెంట్ ఉన్న వాళ్లే ఇక్కడ రాణిస్తారనేది నూటికి నూరు శాతం నిజం. అయితే విలన్ పాత్రల్లో విజ్రుంభించగల ప్రతిభావంతులెందరో తెలుగులో ఉన్నారు. వాళ్లకి అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే కథలో కొత్తదనమే కాదు, తెలుగుదనమూ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనీ...గత వైభవం తిరిగిరావాలని ఆశిద్దాం.                                

ఇమ్రాన్ ఖాన్ పక్కన ఇలియానా

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటికీ గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్ లో మాత్రం బాగానే వుంది. ఇప్పుడామె కెరీర్ అక్కడ ఊపందుకుంటోంది. తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇల్లీ బ్యూటీ హిందీలో 'బర్ఫీ' సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రాలతో బాటు తను కూడా అందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆమె నటనకు సెట్లో యూనిట్ కూడా ఇటీవల కంటతడి పెట్టారంటూ వార్తలొచ్చాయి. అందుకేనేమో, ఆమెకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా నటించే చిత్రంలో ఇలియానా కథానాయికగా ఎంపికైంది. ఈ విషయం గురించి ఇలియానా చెబుతూ, బాలీవుడ్ లో తనకు చాలా ఎంకరేజింగ్ గా వుందని అంటోంది.       

మరో స్క్రిప్ట్ కి ఓకే చెప్పిన గోపీచంద్


రెండేళ్ల క్రితం రామ్ హీరోగా 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీవాస్, తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇందులో గోపీచంద్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్ తో తయారుచేసిన ఈ కథ గోపీచంద్ కి బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడట. గతంలో రవితేజ, త్రిష జంటగా 'కృష్ణ' చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ విజువల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభమవుతుంది. మరోపక్క భూపతి దర్శకత్వంలో కూడా గోపీచంద్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే!
 

చిరంజీవిపై మళ్లీ విరుచుకుపడ్డ బాలకృష్ణ


నిన్నటి దాకా సినిమా రంగంలో ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ, ఆలింగనాలు చేసుకున్న చిరంజీవి-బాలకృష్ణ, ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. రాజకీయాలలో ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పైచేయి కోసం ఇద్దరూ పోటీపడుతున్నారు. 'చిరంజీవిపై పోటీకి సై' అంటూ నిన్న బాలకృష్ణ ప్రకటించడంతో, ఈ రోజు చిరంజీవి దానిని లైట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదనీ, దానిని తాను లైట్ తీసుకుంటానని ఈ రోజు తిరుపతిలో వ్యాఖ్యానించారు.
       ఇదిలా ఉంచితే, బాలకృష్ణ మాత్రం చిరంజీవిపై విమర్శల స్పీడు బాగా పెంచేశారు. ఈవేళ విశాఖపట్నంలో మరింత దూకుడు ప్రదర్శించారు. తనను ఒకరు బాలుడు అన్నారనీ, అలాంటి వారు తనని ఒక వైపే చూశారనీ, కావాలంటే తన మరో రూపం కూడా చూపిస్తాననీ బాలకృష్ణ ఆవేశంగా అన్నారు. 'కోట్లాది రూపాయలకు పార్టీని అమ్ముకున్న వాళ్ళా నన్ను విమర్శించేది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కావాలని కొందరు కలలు కంటున్నారనీ, అలాంటి వారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరితూగరనీ, చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. ఈ మాటల యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి! 
 

Related Posts Plugin for WordPress, Blogger...