e-cigarette review Ping Yahoo GOSSIPS

Monday, April 25, 2011

మరో 'బొమ్మరిల్లు' తీస్తున్న దిల్ రాజు?

సిద్ధార్థ్ హీరోగా భాస్కర్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, నిర్మాత 'దిల్' రాజు బ్యానర్‌ వాల్యూను కూడా మరింత పెంచిందని చెప్పచ్చు. దానికి కారణం, మంచి కుటుంబకథను చక్కని స్క్రీన్ ప్లే తో చెప్పడమే! అందుకే, దిల్ రాజు ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ తో తీస్తున్న 'ఓ మై ఫ్రెండ్' సినిమాకు కూడా ఫేమిలీ డ్రామాతో కూడిన కథనే ఎంచుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్, హన్సిక మరో జంటగా నటిస్తున్నారు.

సంగీత దర్శకురాలిగా కౌసల్య

చక్రి సంగీత దర్శకత్వంలోనే ఎక్కువగా పాటలు పాడే ప్రముఖ గాయని కౌసల్య కూడా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతోంది. నూతన దర్శకురాలు హేమారెడ్డి రూపొందించే ఓ చిత్రానికి ఆమె సంగీతాన్ని సమకూరుస్తోంది. గతంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసిన హేమారెడ్డి ఈ చిత్రాన్ని నూతన తారలతో రూపొందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల టాలెంట్ సెర్చ్ కార్యక్రమం హైదరాబాదులోని బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో ప్రారంభమైంది. బిగ్ బజార్ లో షాపింగ్ చేసిన వారికి ఇందులో నటించే అవకాశం దొరుకుతుందని నిర్వాహకులు తెలిపారు.

సమీరా రెడ్డికి ఇంతలోనే ఏమైంది?

ఏమిటో సమీరారెడ్డికి ఉన్నట్టుండి ఒక్కసారిగా వైరాగ్యం పట్టేసుకుందిప్పుడు. అవును... 'అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? చేసుకోకుండా వుండలేమా? నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను' అంటూ తాజాగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఇంతలోనే అమ్మడికి ఏమైందంటూ!
                అసలు విషయం ఏమిటంటే, ఈమధ్య తన స్నేహితురాలి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి తనే చూసిందట. దాంతో ఈ పెళ్లి తంతు మీద చిరాకు, విసుగు వచ్చేశాయట.  దానికి తోడు, పెళ్లి అనే బంధంతో ఒకరికి భారం అవడం, మరొకరు మనకి బరువవడం తనకిష్టం లేదట. అందుకే పెళ్లికి దూరంగా వుండాలనుకుంటున్నట్టు చెబుతోంది. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఇలా మాట్లాడడంతో, సమీరా ఎక్కడో దెబ్బతినే ఉంటుందని బాలీవుడ్ లో కామెంట్లు వినపడుతున్నాయి.     

'బద్రీనాథ్' కి మూడు పాటలు బ్యాలెన్స్

అల్లు అర్జున కథానాయకుడుగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బద్రినాథ్' షూటింగుకు సంబంధించి ఇక మూడు పాటలు మాత్రం మిగిలి వున్నాయి. వీటిని వచ్చే నెలలో చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంచితే, మరోపక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అలాగే, ప్యాచ్ వర్క్ షూటింగ్  ఈ వారంలో పూర్తి చేస్తారు. అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రాలలో బద్రీనాథ్ ముందుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రూపొందిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫెయిలైన నేపథ్యంలో ఈ చిత్రం పట్ల టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది! జూన్ మొదటి వారంలో దీనిని రిలీజ్ చేస్తారు.

తమన్నాకి, చైతన్యకి మధ్య గొడవా?

తమన్నాకి, నాగ చైతన్యకి మధ్య ఇప్పుడు క్షణం కూడా పడటం లేదట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై పోట్లాటే. ఇద్దర్నీ ఎవరైనా చూస్తే కనుక అసలు వాళ్లెందుకు తగవులాడుకుంటున్నారో అర్ధంకాదు. ఈ విషయాన్ని తమన్నానే చెబుతోంది. అయితే...ఇది నిజజీవితంలో కాదులెండి. త్వరలో విడుదల కానున్న '100% లవ్' సినేమాలోనన్న మాట!
                   "అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది" అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.

రేపటి నుంచి తిరిగి షూటింగులు

గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. సమ్మె విరమించి, మంగళవారం నుంచి వీరు షూటింగులలో పాల్గొంటారు. నిర్మాతలకు, ఫిలిం ఫెడరేషన్ కూ మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఫలించి, ఒప్పందం కుదిరింది. కార్మికులకు 32 శాతం మేర వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
                  ఈ విషయంపై పలుసార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా, వేతనాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. తమ డిమాండ్ మేర వేతనాలు పెంచాల్సిందేనని కార్మికులు పట్టుపట్టడంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదిలా ఉంచితే, తమను సంప్రదించకుండా నిర్మాతల మండలి ఒప్పందాలు చేసుకుంటోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

రాజమౌళి సినిమాలో నితిన్

సరైన సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక వెనుకపడిపోయిన నితిన్ తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని పొందాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'సై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నితిన్ సెలెక్ట్ అయ్యాడు. రాజమౌళి అడగ్గానే నితిన్ వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను రూపొందిస్తున్న 'ఈగ' సినిమా పూర్తయ్యాక ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రారంభిస్తాడు.
Related Posts Plugin for WordPress, Blogger...