Wednesday, January 12, 2011
బాలచందర్ కి అక్కినేని అవార్డు ప్రదానం
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పేరిట ఏర్పాటు చేసిన 'అక్కినేని ఇంటర్ నేషనల్ అవార్డు'ను మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రముఖ తమిళ దర్శకుడు కే. బాలచందర్ కి ప్రదానం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలిల చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ, "అక్కినేని కుటుంబానికి, నాకు మొదటి నుంచీ మంచి సంబంధాలు వున్నాయి. స్కూలులో నాగార్జున నాకు సీనియర్. అయితే నేనే అతనికంటే పెద్దవాడిలా కనిపిస్తాను. ఇక బాలచందర్ గారి 'మరో చరిత్ర', 'ఆకలిరాజ్యం' వంటి సినిమాలంటే నాకెంతో ఇష్టం.ఈ అవార్డు వారికి ప్రదానం చేయడం ఎంతో సమంజసంగా ఉంది" అన్నారు. తెలుగు సినిమా సమస్యలని త్వరలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. వీరప్ప మొయిలీ చెబుతూ, "అక్కినేని గారు నా అభిమాన నటుడు. ఆయన నటించిన 'దేవదాసు' సినిమా నన్నెంతో ఆకట్టుకుంది. ఆ స్థాయిలో ఇండియాలో ఎవరూ నటించలేదు. ఇక బాలచందర్ గారు గొప్ప దర్శకులలో ఒకరు" అన్నారు. అక్కినేని మాట్లాడుతూ, "బాలచందర్ గారు తమిళ దర్శకుడైనా తెలుగ పరిశ్రమతో ఆయనకెంతో అనుబంధం ఉంది" అన్నారు. సన్మాన గ్రహీత బాలచందర్ చెబుతూ, "నా వయసిప్పుడు 81. అక్కినేని వయసు 87. ఆయనని హీరోగా తీసుకుని 'మరో చరిత్ర'ను రీమేక్ చేయాలని ఉంది" అన్నారు. నాగార్జున మాట్లాడుతూ, "నేను శివ, గీతాంజలి చిత్రాలు చేయడానికి బాలచందర్ గారే స్పూర్తి.ఆయన ఈ అవార్డుని స్వీకరించి, దీని విలువని పెంచారు" అన్నారు. బాలచందర్ కు మెమెంటో తో బాటు 5 లక్షల నగదు కూడా అవార్డు కింద ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో ఇంకా టి.సుబ్బరామిరెడ్డి, అమల, అక్కినేని కుటుంబ సభ్యులు, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment